మహబూబాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ పథకాల మంజూరు జాబితాలో తమ పేర్లు లేవంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ను ఆయన సొంతూరులోనే ప్రజలు నిలదీశారు. మంగళవారం మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ పరిధిలోని సోమలతండాలో అధికారులు నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొన్నారు. అధికారులు లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించారు.
ఈ సందర్భంగా పలువురు తమ పేర్లు లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. అనర్హుల పేర్లు జాబితాలో వచ్చాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులు ప్రజలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే మురళీనాయక్ అర్హులు ఎవరు ఉన్నా ఇక్కడే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. చివరికి గ్రామసభ ముగించుకొని వెళ్లిపోయారు.