మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయనిచెరువులు, కుంటలు నిండిపో యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1622 చెరువుల గాను 1400 చెరువులు పూర్తిగా నిండి పోయాయి. 214 చెరువులు మత్తడలు పోస్తున్నాయని మంత్రి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు,వట్టివాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగలేదని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజలు వాగులు, వంకలు, నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు అవసరమయ్యే మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్ లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
ప్రసవ మహిళలు, కిడ్నీ పేషెంట్లను జిల్లా కేంద్రంలోని దవాఖానలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాం అని, పునరవాసా కేంద్రంలో ఆహారం ,తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని ప్రజలు దాన్ని సద్వినియోగించుకొవాలని మంత్రి కోరారు.