హైదరాబాద్: రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుని ఆశయాల దిశగా అందరం ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తితోనే లక్షలాది మందిని సమీకరిస్తూ 14 ఏండ్లపాటు తెలంగాణ పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో కొనసాగించామని, ప్రజా పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పదేండ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు.
విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని, ప్రగతి తోనే సమానత్వం వస్తుందన్న అంబేద్కర్ ఆలోచనతో 1022 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వాటినుంచి బయటకు వచ్చిన లక్షల మంది భవిష్యత్ తెలంగాణ పౌరులు నేడు అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని వెల్లడించారు. వీరంతా జీవితంలో పైకి వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు తొలగిపోతాయన్నారు. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తారని చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనను గౌరవించుకున్నామని తెలిపారు. తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవం అని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్కే సాధ్యమైందని తెలిపారు. అంబేద్కర్ కేవలం ఒక్క జాతికి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన అందరి మనిషని చెప్పారు. ఆరోజు మహాత్మ గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడన్నారు. బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం చేసినా.. అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు. వందకుపైగా దేశాల్లో అంబేద్కర్ను గుర్తుచేసుకుంటారని చెప్పారు.
సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలంతా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఆ దిశగా అందరం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
Live: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.
📍తెలంగాణ భవన్ https://t.co/kHXas1Klek— BRS Party (@BRSparty) April 14, 2024