Chervi Gattu: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఈ ఉత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, కరోనా లాంటి మహమ్మారి మళ్లీ ఎప్పుడూ రాకుండా ఆరోగ్యంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. చెర్వుగట్టుకు రెండో ఘాట్ రోడ్డు నిర్మిస్తామని, భక్తులు నిద్రించేందుకు మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.