హైదరాబాద్ : దేశానికి గుజరాత్(Gujarat) మోడల్ అంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని కాని అక్కడి ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) తెలిపారు. ఆదివారం బీఆర్ఎస్(Brs) కార్వాన్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ ప్రజలు ఉపాధి, విద్యుత్, నీరు ఇతర సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు.
ఏ రాష్ట్రమైనా దేశం మొత్తానికి మోడల్గా ఉంటే అది తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అంటే తెలంగాణా ప్రజలకే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలకూ ఎంతో అభిమానం ఉందని వెల్లడించారు. ఉత్తమ లౌకికవాది కేసీఆర్(KCR) అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ అభివృద్ధిని సాధించిందని వివరించారు.
రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను ఇతర పార్టీల నేతలు చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రధానిగా దేశప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ తదితర పథకాలను మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్, కార్వన్ నియోజకవర్గ ఇన్చార్జి జీవన్ సింగ్, మాజీ కార్పొరేటర్ మిత్ర కృష్ణ, కె.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.