జగిత్యాల : అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్షగా భావిస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ల్ చేరుతున్నారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో సబ్బండ వర్ణాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించామన్నారు. పార్టీ పటిష్టత కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.