హైదరాబాద్, (స్పెషల్ టాస్క్ బ్యూరో -నమస్తే తెలంగాణ): ఓవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు పెరిగిన నిరుద్యోగంతో పట్టణ ప్రాంత యువకులు సతమతం అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్న అంశాలపై (వాట్ వర్రీస్ ది వరల్డ్) చేసిన సర్వేను ప్రముఖ బహుళ జాతి సంస్థ ఐపీఎస్వోఎస్ (ఇండియా) విడుదల చేసింది.
దేశంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలవగా, హింస, నేరాలు, మూడో స్థానంలో ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. జీవన వ్యయం పెరగటం, పరిమిత ఉద్యోగావకాశాల కారణంగా పట్టణ భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇటీవల మణిపూర్లో జరిగిన హింసాకాండ, సైబర్ నేరాలు, ఆర్థిక అవినీతి, నేరాలు పట్టణ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని సంస్థ తెలిపింది.