హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/ లింగాల: రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గురువారం దాదాపు 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. శుక్ర, శనివారాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 5-8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. 130 మండలాల్లో తీవ్ర వడగాలుల నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్కు చెందిన మర్రపల్లి ఈరయ్య (70) వడదెబ్బతో మృతి చెందాడు. బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో సాయంత్రం కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు.