న్యూఢిల్లీ, జూలై 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్తోపాటు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ వరకు.. ప్యారడైజ్ నుంచి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మెహిదీపట్నం జంక్షన్లో స్కైవాక్ నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన 150.39 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.
దీనిపై రక్షణ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. సంబంధిత వివరాలను తెప్పించుకుని త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎస్ శాంతికుమారి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి లీలా నందన్ను కలిశారు. ప్రధాన మంత్రి గ్రామీణ గ్రామ సడక్ యోజన కింద తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు వద్ద పెండింగ్లో 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనురాగ్జైన్తో సమావేశమై.. రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణ పనుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.