హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.3 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 135 కోట్లు జమ అయ్యాయి. రాష్ట్రంలో 6 కోట్ల పెండింగ్ చలాన్లకు చెల్లించాల్సిన మొత్తం రూ. 1,750 కోట్లు. అయితే రూ. 500 కోట్ల వరకు జమ కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నెల 1వ తేదీ నుంచి నెలఖారు వరకు రాయితీపై చలాన్ల రుసుం చెల్లించే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రాయితీపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.