మణికొండ, ఫిబ్రవరి 28: అల్లుడి క్రషర్కు 17 ఎకరాలను అప్పనంగా కట్టబెట్టిన సీఎం రేవంత్రెడ్డి శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయం భూములను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. కోకాపేట నియోపోలీస్లోని శారదా పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టడంతో హరీశ్రావు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ల ఇండ్లతో పాటు ఆలయాలు, మఠాలను కూల్చడమే కాంగ్రెస్ సర్కార్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వం కోకాపేట సర్వే నంబర్ 240లో విశాఖ శారదా పీఠానికి క్యాబినెట్ ఆమోదంతో రెండెకరాల స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ. 1.05కోట్లు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారని తెలిపారు. హెచ్ఎండీఏకు రూ.23లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ కూడా తీసుకున్నారని వెల్లడించారు. నీ పాలనలో కూల్చడమే తప్ప నిర్మించడం లేదా అని సీఎంను ప్రశ్నించారు.
పీఠం భూమిని లాక్కుంటావా?
అల్లుడు వ్యాపారం చేసుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు.. కానీ, హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శారదా పీఠానికి ఉన్న రెండు ఎకరాలను మాత్రం లాక్కొని కూలుస్తావా? అని హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే నీ ధర్మమా..తక్షణమే ఆ అక్రమ క్రషర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎంపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడే బాధ్యత మంత్రి శ్రీధర్బాబు తీసుకోవాలని కోరారు. లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. దేవాలయ స్థలమే జలమండలిశాఖ అధికారులకు అవసరమైం దా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఆలయానికి రోడ్డు అవతలే సర్వేనెంబరు 239, 240లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, దానిని వాడుకోవచ్చు కదా అని సూచించారు. ఆ 17 ఎకరాల భూమిని రేవంత్రెడ్డి తన అల్లుడు, మేనల్లుళ్లు, వాళ్ల అనుచరుల సంస్థ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్కు అక్రమంగా కట్టబెట్టారని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద తానే స్వయంగా అడిగితే ప్రభుత్వం ఈ జవాబు ఇచ్చినట్టు చెప్పారు. పదెకరాలు ఇస్తే 17 ఎకరాలు కబ్జా పెట్టారని మండిపడ్డారు.
భూముల కొనసాగింపు శుభపరిణామం
కోకాపేటలో భూములను శారద పీఠానికే కొనసాగించడం శుభపరిణామనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. జలమండలికి కేటాయించిన నిర్ణయాన్ని రద్దుచేస్తూ సీఎం జారీ చేసిన ఆదేశాలపై శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాజశ్యామలాదేవీ కృపతో సిద్ధించిన విజయమని పేర్కొన్నారు.