నర్సంపేట : తన ఓటమికి తానే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసం పార్టీ ఆగదని.. కారు ఎక్కేవారు ఎక్కొచ్చు.. దిగేవారు దిగొచ్చని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం 24 గంటలు తెరిచే ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగమాటలు చెబుతున్నదని.. ప్రతిపక్షం ఎంటే ఎలా ఉంటుందో మనమందరం ఆ పార్టీకి చూపించాలని అన్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ లోకసభ బీఆర్ఎస్ అభ్యర్థి టికెట్ తనదేనని అన్నారు. తానే పోటీస్తున్నానని సభా వేదికగా ప్రకటించారు. కార్యకర్తలు సమష్టిగా బీఆర్ఎస్ అభివృద్ధికి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చెందడంపై నిరాశ చెందవద్దని అన్నారు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అని కార్యకర్తలు గుర్తుంచుకోవాలన్నారు.