హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సన్నబియ్యం టెండర్లను రద్దు చేసినట్టుగా ఎక్కడా అధికారికంగా ఇంతవరకు ఉత్తర్వుల ఇవ్వలేదని, దీని వెనక మర్మం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పౌరసరఫరాల సంస్థలో జరుగుతున్న కుంభకోణాలపై ఆ సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఈ అవినీతి, కుంభకోణాలపై త్వరలో కేంద్ర విచారణ ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల సంస్థ కుంభకోణాలపై ఆ శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దాటవేత ధోరణిలో ఉన్నారని విమర్శించారు. సివిల్ సప్లయ్ టెండర్లను రద్దు చేస్తున్నట్టు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
సన్నబియ్యం టెండర్లను ఎల్జీ సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ధాన్యం టెండర్లు దక్కించుకున్న సంస్థలు వసూలు చేసిన డబ్బును విశాఖపట్నం బ్యాంకుల్లో దాస్తున్నారని ఆరోపించారు. అవి అక్కడి నుంచి ఢిల్లీ కాంగ్రెస్కు చేరుతున్నాయని వివరించారు. ఈ కుంభకోణాల వెనక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారని పేర్కొన్నారు. టెండర్ల ధర కంటే అదనంగా మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ధాన్యం, సన్నబియ్యం టెండర్ల అవినీతిపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. సీఎం ఢిల్లీలో ఉంటే, డిప్యూటీ సీఎం పంజాబ్లో ఉన్నారని, ఉత్తమ్కుమార్ దేవుళ్ల చుట్టూ తిరుగుతున్నారని, రాష్ట్రంలో సగం క్యాబినెట్ లేదని విమర్శించారు.
ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించిన మిల్లర్లను వదిలేస్తున్నారని, పంపని వారిని డిఫాల్టర్స్ చేస్తామని బెదిరిస్తున్నారని పెద్ది తెలిపారు. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ కట్టిన వారికి మాత్రమే క్లియరెన్స్ ఆర్డర్లు వస్తున్నాయని, 250కు పైగా మిల్లర్లు అదనంగా బిడ్డర్ల అకౌంట్లలో డబ్బులు వేశారని తెలిపారు. ఈ కుంభకోణంపై విజిలెన్స్, ఏసీబీ వెంటనే స్పందించాని కోరారు. వసూలు చేసిన డబ్బును వెంటనే సీజ్ చేయకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రీయ భాండార్ సంస్ధ ఏకలవ్య సూల్స్కు బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి డిఫాల్టర్ అయిందని, అక్కడ ఆ సంస్థ బ్లాక్లిస్ట్లో ఉందని పేర్కొన్నారు. అవినీతి, కుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఎఫ్సీఐ కేంద్రం పరిధిలోనే ఉందని, సివిల్ సప్లయ్ అవినీతిపై బీజేపీ కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం అయిందని, ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎఫ్సీఐపై ఎందుకు సమీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు. టెండర్లు పొడిగించకుండారద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్లో రైతులపై లాఠీచార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పెద్ది తెలిపారు. రాష్ట్రంలో విత్తనాల సరఫరాపై ప్రభుత్వానికి అవగాహన లేదని, విత్తనాల కోసం రైతులు క్యూలలో చెప్పుడు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ లాఠీచార్జ్ అని ఎద్దేవా చేశారు. రైతులకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతులకు కాంగ్రెస్ ప్రభు త్వం లాఠీచార్జ్ను గిఫ్ట్గా ఇచ్చిందని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్కుమార్, పల్లె రవికుమార్, బీఆర్ఎస్వీ నాయకుడు బాలు పాల్గొన్నారు.