Ganja Smuggling | ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలని భావించిన ఓ యువకుడు.. అందుకోసం గంజాయి స్మగ్లింగ్కు పాల్పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రియురాలిని వెంటబెట్టుకుని ఒడిశా నుంచి ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తుండగా ఖమ్మం జిల్లా వైరాలో ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితుల నుంచి 12 కిలోల ఎండు గంజాయి, ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలో హేమలత పుట్టినరోజు ఉండటంతో ఆమెకు ఖరీదైన యాపిల్ ఐఫోన్ కొనివ్వాలని చైతన్య భావించాడు. అయితే అంత మొత్తంలో డబ్బులు సంపాదించేందుకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫోన్ కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేందుకు గంజాయి రవాణా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తన ప్రియురాలితో కలిసి మిత్ర చైతన్య ఒడిశాలోని పడుపుల ప్రాంతానికి వెళ్లారు.
ఇద్దరూ కలిసి అక్కడ సుమారు ఐదు రోజులపాటు ఉన్న అనంతరం గంజాయి సరఫరాదారు భగవాన్ హంతాల్ వద్ద రూ.16 వేలకే 12 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. దాన్ని హైదరాబాద్కు తరలించి శశి, నాగూర్ అనే వ్యక్తులకు సుమారు రూ.6 లక్షలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు.
గంజాయిని బైక్పై పెట్టుకుని హైదరాబాద్కు బయలుదేరిన చైతన్య, హేమలత.. వైరా క్రాస్రోడ్డు వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈగల్ ఫోర్స్ ఎస్సై రవిప్రసాద్, స్థానిక ఎస్సై పుప్పాల రామారావు తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వీరు అటుగా వచ్చారు. పోలీసులను గమనించిన వెంటనే నిందితులు బైక్ వేగాన్ని పెంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎస్సై రామారావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఎస్సై రామారావుతో పాటు చైతన్య, హేమలత స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా 12 కిలోల ఎండు గంజాయి బయటపడింది. దీంతో గంజాయితో పాటు వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మిత్ర చైతన్యకు ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి, ఉప్పల్, మేడ్చల్ పోలీస్స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణాకు సంబంధించిన మూడు ఎన్డీపీఎస్ కేసులు అతనిపై ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పటికీ.. మళ్లీ గంజాయి రవాణాకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయించేందుకు చైతన్యతో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్న శశి, నాగూర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగవాన్ హంతాల్ కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.