హైదరాబాద్ : తెలంగాణ వేరుశనగ నాణ్యతలో దేశంలోనే నంబర్ వన్. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రాష్ట్రంలో భవిష్యత్ యాసంగి పంటగా వేరుశనగను లక్షలాది ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మద్దతు ధరకు మించి వేరుశనగకు మార్కెట్లో ధర లభిస్తుందన్నారు. వేరుశనగ సాగు వైపు రైతులను ప్రోత్సహించే దిశగా బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యేలను కోరారు. రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు వేరుశనగ సాగుకు అనుకూలమైన ప్రాంతాలు. ఇక్కడ పక్కా ప్రణాళికతో వేరుశనగ సాగును పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్ టూరిస్ట్ ప్లాజాలో గురువారం జరిగిన సాగునీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ సమీక్షలో మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, మెతుకు ఆనంద్, రవీందర్ నాయక్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, రాజేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, సీఈలు హరి రామ్, అమిత్ ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చెరువులు, కుంటలన్నీ నింపాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి సరఫరాకు కాల్వలలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. పెండింగ్ పనులు, ఇప్పటికే మొదలుపెట్టిన కాలువల పనులన్నీ పూర్తి చేయాలన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, మైనర్, మేజర్ కాలువల పనులు, స్ట్రక్చర్లు, ఓటీల పనులు ఈ వారంలో పూర్తికావాలని ఇరిగేషన్ శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రైతు వేదికలలో ఈ ఏడాది రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, కలెక్టర్లదేనన్నారు. యాసంగిలో వరి సాగు తగ్గించి రైతులు వేరుశనగ, ఆవాలు, నువ్వులు వంటి నూనెగింజల పంటలు సాగుచేయాలని మంత్రి పేర్కొన్నారు.