హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటింది. మంగళవారం 10.03 గంటలకు ఏకంగా 15,254 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదవడంతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులు చెరిగిపోయాయి. సోమవారం 14,138 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఒక్కరోజులోనే 1,100 మెగావాట్లకుపైగా పెరిగినట్టు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు వెల్లడించారు.
నిరుడు మార్చిలో 14,160 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని, ఆ రికార్డును ఈ ఏడాది డిసెంబర్లోనే అధిగమించామని తెలిపారు. ఈ నెలలో విద్యుత్తు డిమాండ్ 15 వేల మెగావాట్లు దాటుతుందని ముందే ఊహించామని, ప్రస్తుత వేసవిలో ఇది 16 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎంత డిమాండ్ వచ్చినా విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులు సహా అన్ని రకాల వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు మీడియాకు వివరించారు.
తెలంగాణలో సాగు విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాలు పెరగడం వల్ల విద్యుత్తు వినియోగం అధికమవుతున్నదని, రాష్ట్రంలో వినియోగిస్తున్న మొత్తం విద్యుత్తులో వ్యవసాయ రంగం వాటా 37% మేరకు ఉన్నదని వెల్లడించారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్తును వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు. దక్షిణ భారత విద్యుత్తు వినియోగంలో తమిళనాడు అగ్రస్థానంలో, తెలంగాణ ద్వితీయ స్థానంలో ఉన్నదని ప్రభాకర్రావు వివరించారు.