హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం. గత నెలలో ఒకసారి 14,361 మెగావాట్ల అత్యధిక డిమాండ్ రికార్డయ్యింది. ఇప్పు డు ఆ రికార్డును దాటేసింది. వానాకాలంలోనూ ఎండలు మండుతుండటం, వర్షాభావంతో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పంపులు నడుస్తుండటంతో గరిష్ఠ డిమాండ్ నమోదవుతున్నది. నిరుడు ఖరీఫ్ సీజన్లో ఇదే రోజు 11,144 మెగావాట్లు డిమాండ్ నమోదైంది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 4,230 మెగావాట్ల అదనపు డిమాండ్ ఏర్పడింది. ఇదే ఏడాది మార్చిలో 15,497 (30.3.2023) మెగావాట్లుగా విద్యుత్తు డిమాండ్ నమోదైంది.