హైదరాబాద్: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్యతో చిన్నారి ఆత్మకు శాంతి చేకూరిందని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. చిన్నారి ఆత్మగోశ రాజు మృతికి దారితీసిందని చెప్పారు. హత్యాచార ఘటనలు అత్యంత బాధాకరమని వెల్లడించారు. బాలికల్లో అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతామన్నారు. హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె పైవిధంగా స్పందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లిన రాజు సూసైడ్ చేసుకున్నట్లు లోకో పైలట్ పోలీసులకు తెలిపాడు. చేతి మీద ఉన్న మౌనిక అనే పచ్చబొట్టు ద్వారా పోలీసులు అతడిని రాజుగా గుర్తించారు.
గత ఏడు రోజుల నుంచి రాజు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
ఈ నెల 9వ తేదీన సైదాబాద్లో చిన్నారిపై రాజు హత్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు 70 బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.