సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన పలు కార్యక్రమాలతో తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ, దశాబ్దిఉత్సవాల్లో(Decade Celebrations) మూడో రోజు పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్ష ర్యాలీని మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షీటీమ్స్(She Teams) తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న ఘనత తెలంగాణకే దక్కిందని అన్నారు. నాడు కక్షలు, కార్పణ్యాలతో తల్లడిల్లిన పల్లెల్లో నేడు శాంతి కపోతాలు ఎగురుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా పాలన కొనసాగుతుందని అన్నారు. దీంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి 50వేల పరిశ్రమలు నెలకొల్పారని వెల్లడించారు.
ఆధునిక పరిజ్ఞానంతో శాంతి భద్రతలను(Law and Order) పరిరక్షించేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గాదారి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్ ,కలెక్టర్ వెంకట్రావు,ఎస్పీ పి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.