హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అసమ్మతిపై రాష్ట్ర కాంగ్రెస్ కన్నెర్రజేసింది. అసమ్మతి గళాలను మొగ్గలోనే తుంచివేయాలని నిర్ణయించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి సీనియర్ నాయకుడైనా చర్యలు తప్పవని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించారు.
పార్టీ సీనియర్ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎల్ నిరంజన్, కాంగ్రెస్ కురువృద్ధుడు వీ హనుమంతరావు ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పార్టీ వారికి కాదని బయటి నుంచి వచ్చిన వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడాన్ని వీరు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో మహేష్కుమార్ గౌడ్ పరోక్షంగా ఈ ఇద్దరు నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేదని లేదని స్పష్టంచేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏవైనా అభిప్రాయభేదాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై స్పందించవచ్చని సూచించారు.