హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): ‘రైతులు నిత్యం భూ తగాదాలతో తన్నుకు చావాలే.. సాగునీరు లేక వలసలు పోవాలే.. కరువుతో కడుపు మాడాలే.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి ఏపీ రాక్షస పాలన రావాలి’ ఈ పరిస్థితి రాష్ట్రంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోరుకొంటున్నట్టు ఉన్నారు. రాష్ట్ర రైతాంగం చీకు చింత లేకుండా బతకడం ఆయనకు ఇష్టంలేనట్టుగా ఉన్నది. అందుకేనేమో ఈ మధ్య రైతులకు నష్టం జరగాలని తెగ కోరుకొంటున్నారు. ఇందులో భాగంగానే రైతుల భూతగాదాలు తీర్చిన ధరణిపై విషం చిమ్ముతూ, సాగునీటి గోస తీర్చిన కాళేశ్వరంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ రెండూ ఉండకూడదు.. రైతులకు మేలు జరగకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు ధరణిపై.. ఇప్పుడు కాళేశ్వరంపై పడ్డరు. ఎప్పుడు మాట్లాడినా ఈ రెండింటికీ ప్రభుత్వం చేసిన ఖర్చును చూపుతున్న రేవంత్.. వాటి వల్ల రైతులకు కలిగిన ప్రయోజనాలను మాత్రం విస్మరిస్తున్నారు. కోడి గుడ్డుపై ఈకలు పీకిన చందంగా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు పక్కా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవే తప్ప.. అందులో మరో ఆలోచన లేదనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కండ్లుండీ చూడలేని కబోదిలా రేవంత్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ధరణి రాకముందు, కాళేశ్వరం నిర్మించకముందు రైతులు ఎన్ని భూసమస్యలు ఎదుర్కొనేవారో, సాగునీటికి ఎంత గోస పడేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ర్టాన్ని దశాబ్దాలే పాలించిన ఈ కాంగ్రెస్ పార్టీకి నాడు రైతులు పడుతున్న గోసను తీర్చాలనే కనీస సోయి కూడా లేదు. ఇప్పుడు ఆ గోసను తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డగోలు ఆరోపణలతో అడ్డుకొనే కుటిల ప్రయత్నం చేస్తున్నది. రైతులెవరూ భూమి కోసం గొడవ పడొద్దనే సంకల్పంతో నెలల తరబడి మేధోమథనం చేసిన సీఎం కేసీఆర్.. ధరణికి రూపకల్పన చేశారు. ఎవరి భూమి వారికే ఉండేలా, భూమి అమ్మినా.. కొన్నా దళారులకు నయాపైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా గంటల వ్యవధిలోనే పాస్పుస్తకం చేతికి వచ్చేలా సమూల మార్పులు చేశారు. ధరణి తర్వాత రాష్ట్రంలో భూ తగాదాలు దాదాపుగా కనుమరుగయ్యాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 13 జిల్లాలకు సాగునీటిని అందిస్తూ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం దశ, దిశను మార్చేసింది. పసిడి పంటలతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయి.