హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో వెలుగుచూసిన ‘సీటుకు నోటు వ్యవహారం’ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఐదెకరాల భూమి, రూ.10 కోట్లు ఇచ్చానంటూ ఒక నాయకుడు ప్రచారం చేసుకుంటున్నాడని అదే నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న మరికొందరు నాయకులు మీడియా సమావేశంలో ఆరోపించడం ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. కౌన్ బనేగా కరోడ్పతి పేరిట ఈ వ్యవహారం సోషల్మీడియాలో రెండు రోజులుగా ట్రెండింగ్ అయింది. కాంగ్రెస్ పార్టీని, రేవంత్రెడ్డిని పలువురు నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘సీటుకు నోటు’ అంశాన్ని సీరియస్గా తీసుకున్న అధిష్ఠానం.. మీడియా సమావేశం నిర్వహించిన నేతలను మందలించినట్టు తెలిసింది. అంతేకాకుండా కొత్త మనోహర్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి బుధవారం వెల్లడించారు.
మీడియా ఎదుట లోగుట్టు బయటపెట్టిన కొత్త మనోహర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంతో ‘సీటుకు నోటు’ వ్యవహారం మరో మలుపు తిరిగింది. టికెట్ కోసం డబ్బులు ఇచ్చానని చెప్పుకుంటున్న సదరు నాయకుడు.. రేవంత్రెడ్డితోపాటు మరో నేతకు కూడా డబ్బులిచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నాడని మనోహర్రెడ్డి తన సన్నిహితులకు చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో మీడియాకు వెల్లడిస్తానని అంటున్నట్టు సమాచారం. తానొక్కడిపైనే సస్పెన్షన్ వేటు వేయడం సబబు కాదని, దీనిపై విచారణ చేసి, డబ్బులిచ్చానంటున్న వ్యక్తిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.