గోదావరిఖని, సెప్టెంబర్ 10: సింగరేణి కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల ఎరియర్స్ను ఈ నెల 21న చెల్లించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. నిజానికి మొదట సెప్టెంబర్ నెలలో రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే.. ఈ విషయాన్ని టీబీజీకేఎస్ నాయకులు సీరియస్గా తీసుకొని గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకువెళ్లడం, సంస్థ సీఎండీ శ్రీధర్తో మాట్లాడడం, ఆయన చొరవ తీసుకొని డైరెక్టర్ (పా)కు ఒకే దఫా బకాయిలను చెల్లించాలని ఆదేశించడంతో యాజమాన్యం దిగివచ్చింది. బకాయిలను ఒకేసారి చెల్లించేందుకు అంగీకరించింది. సింగరేణి వ్యాప్తంగా 42 వేల మందికి బకాయిలు రూ.1726 కోట్లను చెల్లించనున్నది. 12 శాతం సీఎంపీఎఫ్కు, మరో ఏడు శాతం పెన్షన్కు, 30 శాతం మేర ఇన్కంటాక్స్కు చెల్లింపులు పోగా రూ.900 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ కానుంది. దీంతో సింగరేణి కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి యాజమాన్యం 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలను సెప్టెంబర్ నెలలో రెండు దఫాలుగా చెల్లించాలని నిర్ణయించిందని, దీంతో ఒకేసారి కార్మికులకు బకాయిలను చెల్లించాలని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశామని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి సీఎండీ శ్రీధర్తో మాట్లాడి ఒకేసారి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు.