Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను యాజమాన్యం గురువారం విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి వేతన బకాయిలను బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఫైనాన్స్, పర్సనల్ డైరెక్టర్ ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. తొలుత రెండు దఫాలుగా ఎరియర్స్ చెల్లించాలని భావించినప్పటికీ.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాలమేరకు అనుకున్న సమయానికన్నా ముందే.. ఒకేసారి బకాయిలను చెల్లించామని చెప్పారు. 11వ వేజ్బోర్డు సిఫారసులను కోల్ ఇండియాకన్నా ముందే సింగరేణి అమలు చేసిందని తెలిపారు. ఇన్కం ట్యాక్స్, సీఎంపీఎఫ్, పెన్షన్ సొమ్మును మినహాయించుకొని ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఈ బకాయిలను కోల్ ఇండియాలోని కొన్ని సబ్సిడరీ కంపెనీలు చెల్లించలేదని, దశలవారీగా చెల్లించడానికి సమాయత్తం అవుతున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేశామని బలరామ్ వివరించారు. దీపావళి బోనస్ పీఎల్ఆర్ను కూడా ముందే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎరియర్స్, బోనస్ చెల్లింపు విషయంలో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారని, వీటిని కార్మికులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
గురువారం వేతన బకాయిలు పొందిన వారిలో సింగరేణి టాపర్గా రామగుండం-1 ఏరియా హెడ్ ఓవర్మెన్ వేముల సుదర్శన్రెడ్డి రూ. 9.91 లక్షలతో అగ్రస్థానంలో నిలిచినట్టు డైరెక్టర్ ప్రకటించారు. రెండో స్థానంలో రూ. 9.35 లక్షలతో రామగుండం-2 ఏరియాకు చెందిన ఈఐపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్, మూడోస్థానంలో రూ. 9.16 లక్షలతో శ్రీరాంపూర్ ఏరియా హెడ్ ఓవర్మెన్ ఆడెపు రాజమల్లు నిలిచారని తెలిపారు. సింగరేణి భవన్లో అత్యధిక బకాయిలను పొందిన లచ్చయ్య (రూ. 6.97 లక్షలు), రవిబాబు (రూ. 6.81 లక్షలు), సత్యనారాయణరెడ్డి (రూ. 6.69 లక్షలు)కి డైరెక్టర్ బలరామ్, జీఎం సురేశ్ చెక్కులను అందించారు. అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ రాజశేఖర్రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.