హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక విజయం సాధించింది. మణికొండలోని ‘ఎమ్మార్ హిల్ టౌన్షిప్’పై ఎమ్మార్ గ్రూప్తో కొనసాగుతున్న వివాదంలో నేషనల్ లా ట్రిబ్యునల్ కంపెనీ తాజాగా టీఎస్ఐఐసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. టీఎస్ఐఐసీకి తెలియకుండా ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్కు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఎమ్మార్ కంపెనీ చర్యల వల్ల ఇప్పటివరకు ఎమ్మార్కు ఎదురుదెబ్బ టీఎస్ఐఐసీకి జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరంలో దుబాయ్కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ మణికొండలో ఇంటిగ్రేటెడ్ టూరి జం ప్రాజెక్టును నిర్మించేందుకు ఏపీఐఐసీతో ఒప్పందం చేసుకొన్నది. ఇందులో మారిషస్కు చెందిన ఎమ్మార్ హోల్డింగ్స్ కూడా భాగస్వామిగా చేరింది. మూడు సంస్థలు కలిసి ‘ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్’ పేరుతో ప్రాజెక్టు చేపట్టాయి. ఇందులో ఏపీఐఐసీకి 26 శాతం, ఎమ్మార్ గ్రూప్నకు 74 శాతం వాటాలుగా నిర్ణయించారు. ఎమ్మార్ గ్రూప్ ప్రాజెక్టును ఎమ్మార్ ఎం జీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్కు అప్పగిస్తూ ఒప్పందం చేసుకొన్నది.
రూ.40 వేలకు గజం విలువ చేసే భూములను రూ.5 వేలకే విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏపీఐఐసీ ఎన్సీఎల్టీని ఆశ్రయించడంతో సుమారు 210 ఎకరాల భూము ల లావాదేవీలపై ట్రిబ్యునల్ స్టే విధించింది. దీనిపై విచారణ కొనసాగుతుండగానే రాష్ట్ర విభజన జరిగింది. వివాదాస్పద ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఈ కేసులో పరిహారం తమకే చెందాలని టీఎస్ఐఐసీ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ఎమ్మార్ గ్రూప్ అభ్యంతరం తెలిపింది.
పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం తెలంగాణలోని ఏపీఐఐసీకి చెందిన ఆస్తులన్నింటికీ టీఎస్ఐఐసీ యాజమాన్య హక్కులు సంక్రమించాయని వివరించింది. కాబట్టి ఈ కేసులో ఎమ్మార్ గ్రూప్ తమకు తెలియకుండా ఆస్తులను తనఖా పెట్టడం గానీ, అమ్ముకోవడం గానీ, ఎలాంటి లావాదేవీలు జరుపకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
నష్టపరిహారాన్ని సైతం టీఎస్ఐఐసీకి చెల్లించేలా ఆదేశించాలని విన్నవించింది. వాదనలు విన్న అనంతరం ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచి జ్యుడీషియల్ మెంబర్ భాస్కర పంతుల మోహన్, టెక్నికల్ మెంబర్ వినోద్ కుమార్ సిన్హాతో కూడిన బెంచ్ తాజాగా టీఎస్ఐఐసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆస్తులపై టీఎస్ఐఐసీకే అధికారాలు ఉన్నాయని స్పష్టం చేస్తూనే, ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.