హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న యూనిఫాం హెచ్ఆర్ పాలసీకి ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 1,906 ప్యాక్స్ల్లో విధులు నిర్వహిస్తున్న మూడువేల పైచిలుకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఈ ఉత్తర్వులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై నిబంధనలు పక్కాగా అమలుకానున్నాయి. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారానే కొత్త నియామకాలు జరుగుతాయి. ప్రతి నెల ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అవుతాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందించనున్నారు.
చైర్మన్ల గౌరవ వేతనం పెంపు
ప్యాక్స్ చైర్మన్ల గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. గతంలో వీరికి రూ.300-400 మాత్రమే అందేది. రూ.5 కోట్ల కన్నా తక్కువ లావాదేవీలు ఉన్న ప్యాక్స్ చైర్మన్లకు నెలకు రూ.5 వేలు, రూ.25 కోట్లకు పైగా లావాదేవీలు ఉన్నటువంటి ప్యాక్స్ చైర్మన్లకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన వారికి వివిధ స్లాబులవారీగా గౌరవ వేతనాన్ని చెల్లించనున్నది. ప్రభుత్వం నిర్ణయంపై ప్యాక్స్ చైర్మన్లు, ఉద్యోగులకు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ తొలగించారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణభవన్లో..
తమది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించారని ప్యాక్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రూప్సింగ్ పేర్కొన్నారు. తెలంగాణభవన్లో సంఘం ప్రతినిధులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్రావు, ప్రధాన కార్యదర్శి శంకరయ్య, కోశాధికారి సాయిరెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.