అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ ద్వారా తెలంగాణ (Telangana) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ గాలిలో, నేలలో, నీటిలో, మాటలో, చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతుందని తెలిపారు. ఈ పోరాటమే నాలో స్ఫూర్తి (Spirit ) ని నింపిందని పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అందాలని సూచించారు.
అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం అగ్రపదంలో పాలకులు నిలపాలని కోరారు. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింప చేయాలన్నారు. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి అని ట్వీట్లో పేర్కొన్నారు.