హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి 12 ఏండ్లు గడిచినా ఏపీ నేతల విద్వేషం ఏ మాత్రం చల్లారలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు అనుమతివ్వలేదని అదే రోజు ప్రెస్మీట్ పెట్టి మరి ‘తెలంగాణ మీ అయ్య జాగీరా..?’ అంటూ కయ్యానికి కా లు దువ్విన ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ మరోసారి రాష్ట్ర ఏర్పాటును ఢిల్లీ వేదికగా తప్పు బట్టారు. తెలంగాణ, ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరు సరిగ్గా లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవా రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదంటూనే.. ఏపీని విభజించిన తీరు చూసి మాత్రమే ఆవేదన చెందినట్టు సెలవిచ్చారు. అందుకే ఇప్పటికీ ఆస్తుల పంపకాలు జరుగలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటివరకు కాంగ్రెస్ ధోరణి మారలేదని, తెలంగాణ కోసం అమరులైన 1200 మందికి నివాళులర్పించేందుకు బయల్దేరితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఈ పరిణామం ఆ పార్టీ హిపోక్రసీకి నిదర్శనమన్నారు. పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.