Karthik Reddy | హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరారని ధ్వజమెత్తారు. చేవెళ్ల ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లకు అమ్ముకుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందని కార్తీక్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో పటోళ్ల కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో అవకాశాలు, అవసరాల కోసం పార్టీలు మారుతుంటారు. ఇవాళ దేశ రాజకీయాల్లో ఉన్న 90 శాతం మంది నాయకులు పార్టీలు మారుతున్న వారే. ఇది సర్వ సాధారణం. మోసం, దగా, నయవంచన, వెన్నుపోటు పొడిచే వారి గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చేవెళ్ల నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి మోసం చేశారు. ఇదంతా ఆయన గురించే. ఐదేండ్ల కిందట మా ప్రాంతానికే కాదు.. రాష్ట్రానికి ఆయన ఎవరో తెలియని వ్యక్తి. ఆయన కరీంనగర్ వ్యక్తి అయినప్పటికీ.. పార్టీకి అండగా ఉన్నాడని చెప్పి, కేసీఆర్ చేవెళ్లలో అవకాశం ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాం. మా ప్రాంతం వ్యక్తి కాకపోయినా కూడా మా ప్రాంతం ఆయనను గౌరవించింది. నాయకత్వం కూడా గౌరవించింది అని కార్తీక్ రెడ్డి తెలిపారు.
రంజిత్ రెడ్డిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. రంజిత్ రెడ్డి తన కేరీర్ గ్రోత్లో కేసీఆర్ పాత్ర ఉందని పలుమార్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి ఒక పౌల్ట్రీ అసోసియేషన్ ఉండాలని, దానికి రూపకల్పన చేసింది కూడా కేసీఆరే. ఆ అసోసియేషన్కు రంజిత్ రెడ్డిని ప్రెసిడెంట్ను చేసింది కూడా కేసీఆరే. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండాల్సింది పోయి పార్టీని వీడడం ఎంత వరకు సమంజసం. అవకాశాలు, స్వార్థాల కోసం ఈ నయవంచన అవసరమా..? అని పటోళ్ల కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.
చేవెళ్ల పార్లమెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లకు అమ్మేసిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. జెండాలు మోసి పార్టీని నిలబెట్టిన వారికి ఫలితం లేకుండా పోతుందని స్థానిక నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు మూటలతో పార్టీ టికెట్లు, కార్యకర్తలను మీ వెంట తిప్పుకోవచ్చు. డబ్బు మూటలతో ప్రజలను కొనలేరు, ఓట్లను కొనలేరు. చేవెళ్ల ప్రాంత ప్రజలు మిమ్మల్ని తప్పకుండా ఓడగొడుతారని రంజిత్ రెడ్డిపై పటోళ్ల కార్తీక్ రెడ్డి నిప్పులు చెరిగారు.