లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్ గూడెంలో కడియం శ్రీహరి(MLA Kadiyam) ప్రారంభించిన పథకం విమర్శలకు తావిస్తోంది. గతంలో ప్రారంభించిన పథకానికే మెరుగులు దిద్ది పాత శిలాఫలకం కనిపించకుండా కొత్తగా కడియం ప్రారంభిస్తున్నట్టు శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పటేల్ గూడెంలో స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యేగా డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు ఆ గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు అయింది. పథకం పూర్తి కాగానే అప్పటి ఎమ్మెల్యే రాజయ్య పథకాన్ని ప్రారంభించారు.
దానికి సంబంధించిన శిలాఫలకాన్ని సైతం వేశారు. అదే పథకానికి కడియా శ్రీహరి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయించి కొత్తగా మెరుగులు దిద్దించారు. పాత శిలాఫలకం కనిపించకుండా ఆ శిలాఫలకం పైనే కొత్తగా కడియం శ్రీహరి ప్రారంభిస్తున్నట్లు శిలాఫలకాన్ని వేయించారు. నియోజవర్గానికి తాను అభివృద్ధి ప్రదాతను అని పదేపదే ప్రకటించుకుంటున్న కడియం శ్రీహరి.. పాత పథకాలను కొత్తగా మెరుగులు దిద్ది ప్రారంభించి ఇదేనా కడియం మార్క్ అభివృద్ధి అంటూ ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.