BJP | పటాన్చెరు, నవంబర్ 9: తెలంగాణ వ్యాప్తంగా గురువారం వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేస్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్గౌడ్ మాత్రం జేసీబీలు, బుల్డోజర్లతో వివాదాస్పదంగా ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. అంతేకాదు.. యూపీలో నిందితుల నేరారోపణలు కోర్టుల్లో రుజువుకాకముందే.. అక్కడి బీజేపీ ప్రభుత్వం నేరస్థుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చిన సంఘటనను ఈ ర్యాలీ గుర్తుచేసిందని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. యూపీ తరహా దాడులు చేస్తామని హెచ్చరించినట్టుగా ఉందని వాపోయారు. ఎన్నికలు రాకముందే బీజేపీ నాయకుల తీరు ఇలా ఉంటే.. ఎన్నికల్లో గెలిస్తే వారి ఆగడాలు ఏ స్థాయిలో ఉంటాయోనని చర్చించుకుంటున్నారు. యూపీ తరహా బుల్డోజర్ల సంస్కృతిని పటాన్చెరులో పరిచయం చేసేందుకు నందీశ్వర్గౌడ్ ప్రయత్నిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రశాంతమైన, ఆదర్శవంతమైన పటాన్చెరులో ‘బుల్డోజర్లతో కూల్చివేతలు’ అంటూ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న సందడిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.