Gudem Mahipal Reddy | నియోజకవర్గంలోని స్థానిక సమస్యలు, ప్రోటోకాల్, సెక్యూరిటీ ఇతరత్రా విషయాలపైనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం వస్తున్న వార్తలు అన్నింటినీ ఆయన ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశాం తప్ప.. ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్, సెక్యూరిటీ విషయాలపై ఎస్పీ, కలెక్టర్ను కలిశామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇదే విషయాలపై సీఎం రేవంత్రెడ్డిని కలిశామని చెప్పారు. నిన్న ఒక్కటేసారి కలిశామని.. ఇంకా వందసార్లు కలుస్తాం.. అందులో తప్పేముంది అని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీని, ఇతర కేంద్రమంత్రులను కలిశారని గూడెం మహిపాల్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన కలిశారు.. అలాగే మేము కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వందసార్లు కాకుంటే వెయ్యి సార్లు ముఖ్యమంత్రిని కలుస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే వరకు పోరాడతామని అన్నారు. తనపై నమ్మకం ఉంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని.. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా 3 నుంచి 4 లక్షల మెజారిటీతో గెలిపించబోతున్నామని అన్నారు.