హైదరాబాద్ : ఈనెల 10 (శనివారం)న కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘకాల అపాయింట్మెంట్లను త్వరితగతిన పరిష్కరించే చర్యల్లో భాగంగా హైదరాబాద్లో అమీర్ పేట్, బేగంపేట, టోలీచౌకీలో, కరీంనగర్, నిజామాబాద్ పీఎస్కేలు సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు. పూర్తి అపాయింట్మెంట్లు (తత్కాల్ కింద 60 శాతం, సాధారణ కేటగిరీ కింద 40 శాతం) విడుదల చేసినట్టు వివరించారు. దరఖాస్తుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం పాస్పోర్ట్ సేవా పోర్టల్ని సంప్రదించాలని కోరారు. సాధారణ కేటగిరీ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి మొత్తం 14 పీఓపీఎస్కే(పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు)లలో పూర్తి అపాయింట్ మెంట్లు జారీ చేస్తామని తెలిపారు.
కాగా ప్రత్యేకంగా అందించే ఈ సేవల కోసం ఒక్కసారి మాత్రమే రీషెడ్యూలింగ్కు అనుమతించబడుతుందని వివరించారు. దరఖాస్తుదారులు జాగ్రత్తగా రీ షెడ్యూల్ చేసుకోవాలని, విఫలమైతే వారికి రీషెడ్యూల్ లేదా మరో తేదీని ఎంచుకోవడానికి అవకాశం ఉండదని పేర్కొన్నారు. దరఖాస్తుదారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. స్లాట్ లు బుక్ చేసుకున్న సంబంధిత PSKలు/POPSKలను సంప్రదించాలని సూచించారు. పాస్పోర్ట్ సేవల కోసం ఎటువంటి బ్రోకర్లను ఆశ్రయించొద్దని దాసరి బాలయ్య సూచించారు.