హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ మ్యుటేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పు చేసింది. కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు పాస్బుక్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇకపై వచ్చే కొత్త దరఖాస్తులతోపాటు ఇప్పటికే అనుమతి కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తులకు ఇది వర్తించనున్నది. గతంలో రైతులు పెండింగ్ మ్యుటేషన్ కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ లాగిన్కు వెళ్లేది. కలెక్టర్ అనుమతి తర్వాత లబ్ధిదారులు పాస్బుక్ కోసం మరోసారి ధరణి పోర్టల్లో స్లాట్ బుక్చేసుకొని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్తే.. బయోమెట్రిక్ పూర్తిచేసి పాస్బుక్ మంజూరు చేసేవారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నది. దీంతో అధికారులతోపాటు రైతులకు శ్రమ, ఖర్చు తగ్గుతుంది. ఇందుకోసం పెండింగ్ మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే మీసేవ కేంద్రంలో రైతులు ‘ఈ-కేవైసీ’ ఇవ్వాలి. ఇప్పటికే దరఖాస్తు చేసుకొన్నవారు కూడా మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ-కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు అధికారులు మెసేజ్లు పంపుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతి పొందిన దరఖాస్తుదారులు మాత్రం పాత పద్ధతిలోనే ధరణిలో మరోసారి స్లాట్ బుక్చేసుకొని తాసిల్దార్ కార్యాలయంలో పాస్బుక్ పొందాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,75,861 పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు రాగా.. అధికారులు 1,75,217 దరఖాస్తులను పరిష్కరించారు.