హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఒక రాజకీయ పార్టీకి ఒకటి కంటే ఎక్కువ రాష్ర్టాల్లో ఆదరణ ఉన్నప్పుడు, ఒక నాయకుడికి దేశవ్యాప్తంగా ప్రజా మద్దతు లభించినప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది. దానికి అనుగుణంగా కొన్నిసార్లు అనివార్యంగా పార్టీ పేరును మార్చుకోవాల్సి వస్తుంది. ఇందుకు ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951’ అవకాశం కల్పిస్తున్నది. చట్టంలోని సెక్షన్ 29-ఏ ప్రకారం ఒక రాజకీయ పార్టీ తన పేరును సవరించుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది.
ఎప్పుడైనా మార్చుకోవచ్చు
రాజకీయ పార్టీలు తమ పేర్లను ఎప్పుడయినా సవరించుకొనే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘంలో పనిచేసిన అధికారులు చెప్తున్నారు. పార్టీలు పేరు మార్చుకోవడానికి సంబంధించి ప్రత్యేకంగా నిబంధనలేమీ లేవు. పార్టీ విస్తృత సమావేశంలో తీర్మానం చేసి, ఎన్నికల సంఘానికి లేఖ సమర్పించాలి. ఈసీ దానిని పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే తెలుపాల్సిందిగా నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు లేదా.. ఆ పార్టీ ఇచ్చిన లేఖను స్వీకరించి ఆమోదించవచ్చు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటాయని భావిస్తే పత్రికా ప్రకటన ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. 30 రోజుల వ్యవధిలో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే తుది నిర్ణయం వెలువరిస్తుంది. అధికారికంగా కొత్త పేరు మనుగడలోకి వస్తుంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుకు ముందు.. ‘అఖిల భారత’ అనే పేరు చేర్చి జాతీయ పార్టీగా తీర్మానం చేసి పంపారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం లభించింది. ఎన్సీపీ, ఎన్పీపీ వంటి పార్టీలు సైతం తీర్మానాల ద్వారా జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సైతం అదేవిధంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ దరఖాస్తుకు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం లభిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కొత్త పేరు, కొత్త అజెండాతో జాతీయ పార్టీగా ఎన్నికల బరిలో నిలవనున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, 2,797 గుర్తింపు లేని పార్టీలు నమోదై ఉన్నాయి.
ఇవీ నిబంధనలు
అప్పటికే మనుగడలో ఉన్న మరో రాజకీయ పార్టీని ప్రభావితం చేసేలా కొత్త పేరు ఉండకూడదు.
పార్టీ పేరును హిందీ, ఇంగ్లిష్ లేదా ఏ ప్రాంతీయ భాషలోనైనా నిర్ణయించుకొనే హక్కు ఉంటుంది. అయితే, ఆ పేరును అనువదిస్తే మరో పార్టీ పేరు స్ఫురణకు వస్తున్నదని, దాని పాపులారిటీకి సమస్య అవుతుందనే ఫిర్యాదులు ఉండకూడదు.