హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారు. కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారు. హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించిన కిషన్రెడ్డి కనీసం దానిని సరిదిద్దుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. కిషన్రెడ్డి తన అర్ధసత్యాల ప్రచారంలో భాగంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి తప్పుడు మాటలు చెప్తున్నారు.
-మంత్రి కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా సమాధానం చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇటు తెలంగాణకు గానీ అటు సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు గానీ నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు ఇచ్చిందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గుజరాత్ బాసులను సంతోషపెట్టడానికి అర్ధ సత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తిగా కిషన్రెడ్డి మారారని మండిపడ్డారు. కిషన్రెడ్డిని సోదరుడిగా గౌరవిస్తానని, కానీ ఆయనలాంటి తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తిని, నిస్సహాయ కేంద్రమంత్రిని చూడలేదని విమర్శించారు.
తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేంద్రం కేటాయించిందని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కనీసం క్షమాపణ చెప్పే ధైర్యం కూడా కిషన్రెడ్డికి లేదని మండిపడ్డారు. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని కిషన్రెడ్డి ప్రకటించారని, కానీ యథారీతిగా ఆయన గుజరాతీ బాసులు దాన్ని తమ రాష్ర్టానికి తరలించుకుపోయారని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించిన కిషన్రెడ్డి కనీసం దానిని సరిదిద్దుకొనే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. కిషన్రెడ్డి తన అర్ధసత్యాల ప్రచారంలో భాగంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి తప్పుడు మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలలో ఒకటైన బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని చెప్పడం మరోమారు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. కిషన్రెడ్డి కేవలం తన గుజరాతీ బాస్ల మెప్పు పొందేందుకే ఇలా అర్ధసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.