హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో నిర్వహించిన వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేలాది మందితో ఈ నెల 13,14వ తేదీలలో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణిచివేస్తుందన్నారు. బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీలంటే వాటాదారులని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న దాదాపు 16 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో 54 శాతం బీసీలు ఉన్నారని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.