హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా 4% పాలలో కల్తీ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాలను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించింది. పాల నాణ్యతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు తేలాయని వివరించింది. పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గతంలో దేశవ్యాప్తంగా 1,103 పట్టణాల్లోని పాల ఉత్పత్తి కంపెనీలు, డెయిరీలు, స్థానిక వ్యాపారుల నుంచి మొత్తం 6,432 శాంపిళ్లను సేకరించి పరీక్షించినట్టు పేర్కొన్నది. ఇందులో మొత్తం 246 శాంపిళ్లలో కల్తీలు ఉన్నట్టు తేలిందని చెప్పింది. అత్యధికంగా చిక్కదనం కోసం మాల్టోడెక్స్ట్రిన్ (గోధుమ, వరి, మక్క వంటి పిండి పదార్థాలు), రుచి కోసం చక్కెర వంటి పదార్థాలను కలుపుతున్నట్టు తేలిందని పేర్కొన్నది. ఎలక్ట్రో కెమికల్ విధానంలో 10 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే కల్తీని గుర్తించవచ్చని పేర్కొన్నది.