శంకరపట్నం, మార్చి 12 : పట్టుమని 24 ఏండ్లు కూడా నిండలేదు. అప్పుడే ఆ యువకుడిని డెంగీ జ్వరం రూపంలో మృ త్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. తమ కొడుకు అవయవాలు దానం చేసి మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. వివరాలిలా.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంకు చెందిన గాజుల శ్రీనివాస్-రమాదేవి దంపతుల చిన్న కొడుకు నందన్ (24)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేర్పించారు. 19 రోజులపాటు క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు తెలిపారు. ఇదే సమయంలో జీవన్దాన్ సంస్థ ఆ తల్లిదండ్రులకు అవయవ దానం పై అవగాహన కల్పించడంతో తమ కొడుకు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో వైద్యులు కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ఆ తర్వాత దవాఖాన వైద్యులు, నర్సులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది మృతదేహం వద్ద గౌరవ వందనం సమర్పించారు.