Sircilla | సిరిసిల్ల రూరల్, మే 19: ఏడేండ్లుగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న కూతురికి లక్షలు వెచ్చించి దవాఖానల్లో చికిత్స చేయించారు. ఇంతలో వ్యాధి కొంతమేర నయంకావడంతో పెండ్లి చేశారు. నెల కిందట వ్యాధి తిరగబెట్టి భర్త, కొడుకును కొట్టడం, చుట్టుపక్కల వారితో తరుచూ గొడవ పడుతుండటంతో విసిగిపోయిన తల్లిదండ్రులు నిద్రిస్తున్న కూతురికి ఉరేసి చంపేశారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అఖిల్మహాజన్ ఆదివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం& సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చెప్యాల ఎల్లవ్వ-నర్సయ్య దంపతుల కూతురు ప్రియాంక (27) ఏడేండ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నది. తల్లిదండ్రులు ప్రియాంకకు పలు దవాఖానల్లో చికిత్స చేయించారు. అనేక ఆలయాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వ్యాధి నయం కావడంతో 2020లో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. వీరికి 13 నెలల బాబు ఉన్నాడు. వీరు కరీంనగర్లో నివాసం ఉంటున్నారు.
ఇక కూతురు కాపురం సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో నెల క్రితం ప్రియాంకకు వ్యాధి తిరగబెట్టింది. అప్పటినుంచి ఆమె చుట్టుపక్కల వారిని దూషిస్తూ గొడవపెట్టుకొంటుంది. భర్తతోపాటు 13 నెలల బాబుపైనా దాడి చేస్తున్నది. భర్త.. ప్రియాంక పరిస్థితిని వారి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు కరీంనగర్కు వచ్చి దవాఖానలో చికిత్సచేయిస్తామని కూతురిని ఇంటికి తీసుకెళ్లారు. తరువాత ప్రియాంకను స్థానిక బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ మూడు రోజులపాటు ఉంచారు. అయినప్పటికీ ప్రియాంక విపరీత చేష్టల్లో మార్పురాలేదు. ఈనెల 14న రాత్రి ఒంటి గంటకు ఇంట్లో నిద్రిస్తున్న కూతురిని నూలు దారంతో ఉరేసి చంపేశారు.
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు భర్త.. ప్రియాంక మృతదేహాన్ని నంగునూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ప్రియాంక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ డయల్ 100కు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల వారిని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు ప్రియాంక తల్లిదండ్రులు నర్సయ్య-ఎల్లవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. పోలీసులు హత్యకు ఉపయోగించిన నూలు దారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించారు.