టీవీలో చూసి చిన్నారిని గుర్తుపట్టి
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): అమ్మ ఎనిమిదేండ్ల నిరీక్షణకు తెరపడింది. అందరూ పిచ్చిదన్నా భరించింది. వెతుకులాట అనవసరమన్నా సహించింది. చివరికి.. ఆ తల్లి దీక్ష ముందు విధి ఓడిపోయింది. ఎట్టకేలకు.. గారాలబిడ్డ తమ వద్దకు చేరడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోమవారం హైదరాబాద్ అమీర్పేటలోని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయం ఈ ఆనందానికి వేడుకైంది.
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్లోని ఈసీఐఎల్కు చెందిన కృష్ణ, అనురాధ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. చిన్న వయస్సులోనే ఓ పాప ఇంటిముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఫలితం కనిపించ లేదు. అందరూ విసిగిపోయి వదిలేశారు. కానీ ఆ తల్లి మనసు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఎనిమిదేండ్లయినా నిరీక్షణను ఆపలేదు. చివరికి ఓ టీవీ షోలో ఓ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తల్లి మనసు గుర్తించింది. ఆ పాప తన కూతురేనని గ్రహించింది. ఆ చిన్నారి వాళ్ల పాపేనని తేలడంతో.. సోమవారం బాలల సంరక్షణ కమిటీ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం సంతోషంగా ఉన్నదని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాస్రావు తెలిపారు. ఎంతోమంది తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేర్చామన్నారు. అయితే ప్రభుత్వంతోపాటు ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉన్నప్పుడే పిల్లల అపహరణలు, తప్పిపోవడాలు పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ సునంద, ఆర్జేడీ శారద, ఏడీ పద్మజా రమణ, బాలల సంరక్షణ భవన్ కోఆర్డినేటర్ హర్షవర్ధిని, డీసీపీవో ప్రవీణ్ కుమార్, లీగల్ ఆఫీసర్ దీప్తి కిరణ్, కౌన్సెలర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.