హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): దీరావత్ మహేశ్నాయక్..! ఇతను దివ్యాంగుడు. అయితేనేం ఒంటి చేత్తోనే క్రికెట్ బంతిని బౌండరీలు దాటిస్తాడు. వాలీబాల్ ఆటలోనూ రాణిస్తున్నాడు. శామీర్పేట పరిధిలోని లింగాపూర్ తండాకు చెందిన మహేశ్నాయక్ ఆటల్లోనూ కాదు సామాజిక స్పృహను ప్రదర్శించడంలోనూ, సాహసోపేత కార్యక్రమాలు చేపట్టడంలోనూ అతనికి అతడే సాటి.
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా ఆయన రాకను నిరసిస్తూ హైదరాబాద్లోని ప్యాట్నీ సెంటర్ వద్ద ఒక్కడే ధైర్యంగా నిలబడి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా శనివారం హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన 73వ రాజ్యాగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్యూ) పరిరక్షణ ఉద్యమంతో గొంతు కలిపాడు. పీఎస్యూలను అమ్మేవాళ్లను నమ్మొద్దని నినదించాడు.
ప్రజలను మతం ప్రాతిపదికన విభజించే వాళ్లకు ఓట్లు వేయవద్దంటూ అక్కడ ఉన్నవారితో ప్రతిజ్ఞ చేయించాడు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు కార్యక్రమాలకు మద్దతుగా ఒంటి చేత్తోనే బైక్ నడుపుతూ వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటుదామంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఎందుకు ధరించాలో వివరిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించాడు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు చేనేత వస్ర్తాలు ధరించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గతంలో హైదరాబాద్లో ప్రచారం చేశాడు. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్, మునుగోడు తదితర నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతుగా బైక్కు ఫ్లెక్సీలు కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నాడు.