కరీంనగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ, సెటిల్మెంట్ దందాలు సాగిస్తున్నారని, అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు. బండి సంజయ్ లెక్కకు మిక్కిలిగా సాగిస్తున్న అక్రమాలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఖాదీ సౌత్ జోనల్ కమిటీ చైర్మన్ పేరాల శేఖర్రావు సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు. బండి సంజయ్కి పరిణతి లేదని, నియంతృత్వ పద్ధతులతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడా లు, బ్లాక్మెయిల్ ఇష్యూలు, అంతర్గతంగా సెటిల్మెంట్లు, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం బండికి అలవాటుగా మా రిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తలను అవమానిస్తున్నారని, ఒంటెత్తు పోకడలు, యూజ్ అండ్ త్రో పద్ధతులు అవలంభిస్తున్నారని మండిపడ్డారు.
కరీంనగర్ గ్రానైట్స్ అవినీతిని లేవదీసి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకోవడం, రాజ్న్యూస్లో జూపల్లి రామేశ్వర్రావు మైనింగ్ అక్రమాలంటూ సీరియల్స్ ఇచ్చి తదుపరి సెటిల్మెంట్ చేసుకోవడం, అదే చానెల్లో నలుగురు ముఖ్య బీజేపీ నాయకులతో కోట్లాది పెట్టుబడులు పెట్టించి వారిని నట్టేట ముంచడం, దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను పక్కనబెట్ట్టి సికింద్రాబాద్ కంటోన్మెంట్ వీసీ పోస్టును ఆర్థిక కారణాల వల్ల కొత్తవారికి ధారాదత్తం చేయడం, మాఫియా ైస్టెల్ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వీటిన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి సిద్ధమని సవాల్ చేశారు. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనందున సోషల్ మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. రాష్ట్ర నాయకత్వంలో సమన్వయలోపం, స్వయంకృతాపరాధాల కారణంగా పార్టీ పరిస్థితి ‘మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు’ చందంగా తయారైందని పేర్కొన్నారు. ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తప్పుబట్టడాన్ని తాను వంద శాతం సమర్ధిస్తున్నట్టు స్పష్టంచేశారు. కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఇతర పార్టీ పెద్దలు చేయాల్సిన పనిని అర్వింద్ చేశారని పేర్కొన్నారు.
కోట్లు ముట్టజెప్పినవారికే పదవులు: అంజయ్య
పెట్టుబడిదారులు, కోట్లు ముట్టుజెప్పిన వారికే బండి సంజయ్ పార్టీ పదవులు ఇస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి కన్నం అంజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెలాఖరులోగా సీనియర్ల అత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసుకొని, తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో దళితులపై వివక్ష చూపుతున్నారని, దళితులకు పార్టీలో స్థానం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు ఉన్న వారికే పార్టీ పదవులు ఇస్తున్నారని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నవారిని అలక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి వ్యవహార శైలిపై తాను ఇప్పటికే అధిష్ఠానానికి, కోర్ కమిటీకి లేఖల ద్వారా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
బండి సంజయ్ సొంత లావాదేవీల కోసమే పని చేస్తున్నారని, పార్టీ కోసం కాదని మండిపడ్డారు. బండి తన స్వప్రయోజనాల కోసమే ఎన్నారైలు, కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు టికెట్లు ఇస్తామంటూ జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుడు గడ్డం వివేక్ అహంకారపూరితంగా వ్యవహరిస్తూ.. తన సొంత ఏజెండా అమలుచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన దళిత నేత బంగారు లక్ష్మణ్ జయంతి, వర్ధంతిని నిర్వహించని బండి సంజయ్.. కాంగ్రెస్ నాయకుడైనా వెంకటస్వామి జయంతి, వర్ధంతి, విగ్రహావిష్కరణలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడి హోదాలో అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు. తాజాగా మరో సీనియర్ నేత రఘునాథరావు సైతం బండిపై ఆరోపణలు గుప్పించారు. పేరాల చంద్రశేఖర్రావు ఆరోపణలు స్వార్థపూరితం కాదని స్పష్టంచేశారు. రాజకీయ వలస పక్షులతో శేఖర్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంఘ్ జోక్యం చేసుకోవాలని కోరారు.