హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు కాగితరహిత (పేపర్లెస్) పద్ధతిలో రుణాలను మంజూరుచేసే విధానం త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇందుకోసం స్త్రీనిధి సంస్థ ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఐరిస్, వేలిముద్రల ఆధారంగా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ (ఈ-సైన్)ను అమల్లోకి తీసుకొచ్చి రుణాల మంజూరును పేపర్లెస్గా మార్చనున్నది. ఇప్పటికే ఎస్హెచ్జీ సభ్యుల ఆధార్, ఇతర వివరాలన్నీ గ్రామ సమాఖ్యల వద్ద గల ట్యాబ్లు, పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)లో నిక్షిప్తమై ఉన్నందున ఈ-డాక్యుమెంటేషన్ సులభతరం అవుతుంది. బయోమెట్రిక్ ఆధారంగా రుణపత్రాల్లో సభ్యురాలు సంతకాలు చేసిన సమయం, తేదీలు ఆటోమెటిక్గా జనరేట్ అవుతాయి. అనంతరం వాటిని సర్వర్లో సేవ్ చేస్తారు. ఆ వివరాలను ఎప్పుడుకావాలంటే అప్పుడు పొందవచ్చు. ఈ విధానంలో ఎలాంటి మోసాలకు, జాప్యానికి ఆస్కారం ఉండదు.
పారదర్శకంగా రుణప్రక్రియ
స్త్రీనిధిని పేపర్లెస్ చేయాలనేది మా ఉద్దేశం. దీనిలో భాగంగా ఇప్పటికే స్త్రీనిధి యాప్ను తీసుకొచ్చాం. ఎస్హెచ్జీల సమావేశాలు, నిర్ణయాలు, రుణాలు ఎందుకు తీసుకొంటున్నారు? ఎవరు తీసుకొంటున్నారనే వివరాలన్నీ అందులోనే నమోదు అవుతున్నాయి. కానీ రుణాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఫిజికల్గా పత్రాలు నింపాల్సి వస్తున్నది. ఈ-సైన్తో ఇక వాటి అవసరం ఉండదు. రుణ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా పూర్తవుతుంది. ఈ-డాక్యుమెంటేషన్ అమలుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకొంటున్నాం. రాష్ట్ర ఐటీశాఖ సహకారంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తెస్తాం.
– విద్యాసాగర్రెడ్డి, స్త్రీనిధి ఎండీ
ప్రయోజనాలు ఇవీ..
రుణం పొందే సమయంలో ఆధార్తో అనుసంధానమైన బయోమెట్రిక్స్ తీసుకొంటున్నందున అదే ఈ-సైన్గా ఉపయోగపడుతుంది. భౌతిక పత్రాలపై సంతకాలు చేయాల్సిన అవసరం ఉండదు. రుణం తీసుకోవడానికి ముందే డాక్యుమెంటేషన్ పూర్తవుతుంది.
రుణపత్రాల్లో వివరాల నమోదు ప్రక్రియ అంతా ఆటోమెటిక్గా జరిగిపోతుంది. ప్రత్యేకంగా ఎలాంటి పత్రాలు నింపాల్సిన అవసరం ఉండదు. సంఘాలకు పనిభారం తగ్గుతుంది. సమయం వృథా కాదు.
రుణపత్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావుండదు. రుణపత్రాల ముద్రణ, రవాణా, నిర్వహణ, భద్రతకు సంబంధించిన సమస్యలేమీ ఉండవు.