హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, వారి సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో సాగుతుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే మహోన్నత లక్ష్యంతో నాటి సోషల్ ఇంజినీర్గా ప్రసిద్ధి పొందిన సురీందర్ కుమార్ డే (ఎస్కేడే) పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారని గుర్తుచేశారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమంలో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థ మనదేశంలో రూపుదిద్దుకొన్నదని సీఎం తెలిపారు.
దేశానికి ఆదర్శంగా..
కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరుగాలనే నాటి ఎస్కేడే ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని సీఎం అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకొనేలా ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లెల్లో పాలనావ్యవస్థను ప్రభుత్వం బలోపేతంచేసిందని చెప్పారు. పల్లెల అభివృద్ధికిగాను ప్రతినెలా రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి ప్రతినెలా రూ.148 కోట్లు క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనాన్ని సంతరించుకొని, అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రం అందుకోని విధంగా తెలంగాణ పంచాయతీరాజ్శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలచేత అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలను అందుకొంటున్నదని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతున్నదనడానికి ఈ అవార్డులు, ప్రశంసలు నిదర్శనంగా నిలిచాయని సీఎం తెలిపారు.
సబ్బండ వర్ణాలను అభివృద్ధితో భాగస్వామ్యం చేస్తున్న పథకాలు
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు పథకాలు సబ్బండ వర్ణాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తద్వారా నాటి ఎస్కేడే కలలు కన్న పంచాయతీరాజ్ సహకార వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రం ముందంజలో ఉన్నదని సీఎం తెలిపారు.