హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)ను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జేపీఎస్లు నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా చేస్తున్న సమ్మెను తక్షణమే విరమించాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. వారిని ప్రభుత్వంగానీ, ప్రభుత్వం తరఫున ఎవరూ చర్చలకు పిలవలేదని స్పష్టంచేశారు.
జేపీఎస్లపై సీఎం కేసీఆర్కు మంచి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వారు ఇప్పటికైనా సమ్మె విరమించాలని సూచించారు. సంఘాలు కట్టబోమని, యూనియన్లలో చేరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని జేపీఎస్లు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చి తీరా ఇలా చేయటం తగదని హితవుపలికారు. పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులు తనతో ఫోన్లో మాట్లాడి సమస్యలు చెప్పుకుంటే బాధ్యత గల ప్రభుత్వ ప్రతినిధిగా వాటిని విన్నానని, ప్రభుత్వం తమను చర్చలకు పిలిచిందని సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని మంత్రి సూచించారు. ఇప్పటికైనా మించిపోలేదని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి జేపీఎస్ను కోరారు.