Assembly Elections | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు పార్టీల నేతలు తాయిలాల ప్రక్రియకు తెరలేపారు. గట్టుచప్పుడు కాకుండా డబ్బులు పంచేందుకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా రూపొందించే ప్రహసనం కొత్త పంచాయితీకి కారణమవుతున్నది. నోట్ల పంపిణీ ప్రయత్నాలను కొందరు ఓటర్లు రట్టు చేస్తున్నారు. ఎన్నికల ప్రలోభాలపై పోలీసులు, ఎన్నికల అధికారులు పటిష్ఠ నిఘా పెట్టారు. కానీ, కొందరు గుట్టుగా ప్రలోభాలు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఓ పార్టీ ప్రతినిధి ఓ కాలనీకి వచ్చి నోటు పుస్తకాల్లో ఓటర్ల పేర్లు రాసుకుంటున్న సమయంలో కొందరు ఆ ప్రతినిధి దగ్గరకొచ్చి.. మా ఇంట్లో ముగ్గురు ఓటర్లు ఉంటే మీరు ఇద్దరి పేర్లు మాత్రమే రాసుకున్నారు.. మా చిన్న అమ్మాయి పేరు రాసుకోండి.. అని ఒకరు.. మా ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురు పేర్లు రాసుకున్నారేంటి? అని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారం ఇతర పార్టీల నేతలకు, ఎన్నికల అధికారులకు తెలుస్తుండటంతో నాయకులు అక్కడ నుంచి పారిపోతున్నారు.
హైదరాబాద్లోనూ అదే తంతు
హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో 24 ఫ్లాట్లు ఉన్నాయి. ఓ పార్టీ నాయకుడు 20 ప్లాట్ల కుటుంబాల వివరాలే రాసుకున్నారు. చివరి అంతస్థుల్లో ఉన్న కుటుంబాలను వదిలేశారు. నాలుగు కుటుంబాల్లో 15 మంది ఓటర్లు ఉన్నారని, మా పేర్లు రాసుకోవాలంటూ వచ్చి నేతలతో స్థానికులు గొడవకు దిగారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని ఒక గ్రామంలోనూ ఇదే పంచాయితీ వెలుగుచూసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, మునుగోడు నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఇదే తరహా ఘటనలు బయటపడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో పొరుగు ఇంటి వాళ్లకు ఇచ్చిన డబ్బులతో పోల్చుకుంటూ గొడవకు దిగుతున్న ఘటనలు ఉన్నాయి. గుట్టుచప్పుడు కాకుండా నోట్లు పంపిణీ చేయాలని కొన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, గుట్టు రట్టు కావడం పట్ల అభ్యర్థులు ఆందోళనకు చెందుతున్నారు.