కొడకండ్ల, మార్చి 17: మెడికో ప్రీతి కుటుంబానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అండగా నిలిచారు. ఇటీవల ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల నుంచి రూ.20 లక్షలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేసి ఆదుకుంటామని ప్రకటించారు. ఆ మేరకు శుక్రవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను కలిశారు.
ప్రీతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి.. రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెడికో మరణాన్ని రాజకీయం చేయడం కాదని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ముఖ్యమని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని తెలిపారు. కేసు విచారణ జరుగుతుందని, నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా శిక్షిస్తామన్నారు.