హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడున్నరేండ్లుగా పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల(టీపీఎస్ఎఫ్) ఫెడరేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని తన క్యాంప్ ఆఫీసులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వారు వినతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్ రావు, కోశాధికారి శశిధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఆకారపు సురేశ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, జనగామ జిల్లా అధ్యక్షుడు గర్వందుల శ్రీకాంత్ గౌడ్, సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పృథ్వీ, శివ, భాసర్, పాషా, వినయ్ తదితరులు ఉన్నారు.
రాజ్కుమార్కు మెరుగైన వైద్యం: ఎర్రబెల్లి
ఆదిలాబాద్ జిల్లా పీచర పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్వోఎఫ్ఆర్ సర్వేలో భాగంగా విధులు నిర్వర్తించి.. ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి వెంటనే రాజ్ కుమార్కు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ను ఆదేశించారు.