హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ (టీటీసీఎఫ్సీ) తొలి చైర్మన్గా పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో అట్టహాసంగా జరిగింది. తొలుత పల్లె రవి తన చాంబర్లో చైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, భాసర్రావు, గాదరి కిశోర్ హాజరయ్యారు. కార్పొరేషన్ల చైర్మన్లు సతీశ్రెడ్డి, బాలరాజు యాదవ్, రామచంద్రునాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్సాగర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు తదితరులు రవిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జరిగిన అభినందన సభలో మంత్రులు జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. ఉద్యమకారులందరికీ సీఎం కేసీఆర్ అవకాశాలను కల్పిస్తున్నారని, అందుకు పల్లె రవికుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తుల ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని కొనియాడారు. టీటీసీఎఫ్సీ చైర్మన్ పల్లె రవి మాట్లాడుతూ మహదావకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గౌడ సామాజికవర్గ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఉపేందర్, శుభప్రద్పటేల్, కిశోర్గౌడ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.